‘జిందగీ న మిలేగీ దొబారా’
ఇది మూడు గంటల సినిమా కాదు. ఆరు దశాబ్దాలుగా ఒడవని తండ్లాట. పోరాట ఒరవడి. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంత్చారిని ఆదర్శంగా తీసుకుంటూ, ఏ తల్లికీ పుత్రశోకం కల్గించొద్దంటూ మాధురి, పావనిలు చేస్తున్న ‘బైక్ యాత్ర’ కు పాఠకులందరి తరఫునా ‘బతుకమ్మ’ వందనాలు.
‘జిందగీ నా మిలేగీ దొబారా’ సినిమా ప్రచారం కోసం కత్రినా కైఫ్ బైక్ను వీథుల్లో నడిపింది. జనాలు చూడడానికి ఎగబడ్డారు. ఇది కేవలం మూడు గంటల సినిమా కోసం. మరి తరతరాలుగా దగా పడుతున్న తెలంగాణ కోసం ఇద్దరు అక్కాచెప్లూళ్లు బైక్పై తిరుగుతూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. కేవలం వీరిని చూడడానికే రాలేదు జనం. వారి ఆకాంక్షను గుండెల్లో పెట్టుకోవడానికి వచ్చారు.
ఉన్నత చదువులు చదివిన ఈ అక్కా చెప్లూళ్లు తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుతామని పోరుబాట పట్టారు. ‘ఆత్మబలిదానాల కన్నా ప్రజల చైతన్యమే మిన్న’ అని మోటార్ సైకిల్పై పల్లె పల్లె తిరుగుతూ తెలంగాణ ఏర్పాటు అవసరం గురించి ప్రచారం చేస్తున్నరు. ఆ అక్క పేరు మాధురి. చెల్లె పేరు పావని.
వీరిది యాదగిరిగుట్టకు పది కిలోమీటర్ల దూరంలోని చల్లూరు అనే గ్రామం. మాధురి ఎంఎస్సీ బీఎడ్ చేసి, ప్రస్తుతం యాదగిరిగుట్టలోని ‘శ్రీ లక్ష్మీ నరసింహస్వామి’ జూనియర్ కళాశాలలో ప్రయివేటు లెక్చరర్గా పనిచేస్తోంది. పావని ఎంబీఎ చేసి, ప్రస్తుతం బ్యాంకులో ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నది.
‘తెలంగాణ పోరాటం వైపు ఆకర్షితులు కావడానికి ప్రధాన కారణం ఏంది?’ అంటే ‘శ్రీకాంతాచారి’ అన్నరు వీళ్లు. అవును అది మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైన సందర్భం. ‘‘ఎల్బీనగర్ రింగ్రోడ్డు దగ్గర శ్రీకాంత్చారి పెట్రోల్ పోసుకొని ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేస్తూ ఆత్మార్పణ చేసుకున్నడు. అది చూసి చలించిపోయాం. అప్పటి వరకు చదువులపైనే మా ధ్యాసంతా. ఇక అప్పట్నించి తెలంగాణ ఉద్యమం వైపుకు మనసు పెట్టినం. శ్రీకాంతన్న మాదిరిగా కాల్చుకొని ఆత్మ బలిదానం చేయడం కాదు, బతికుండి తెలంగాణ సాధించుకోవాలనుకున్నాం’’ అని అన్నరు.
‘ఆడపిల్లలను ఒంటరిగా బయటికి పంపడానికి భయపడే ఈ రోజుల్లో మీరు ఇంత ధైర్యంగా బయటికి వచ్చి ఎలా ప్రచారం చేస్తున్నారు?’ అని అడిగితే, మాధురి ఇట్లన్నది. ‘‘మాకు అన్నదమ్ములు లేరు. మేము నలుగురం ఆడపిల్లలం. ఇద్దరు అక్కలకు పెళ్ళిళ్ళు అయ్యాయి. మమ్మల్ని మా తల్లిదంవూడులు గారాబంగా పెంచారు. మా నాన్న పేరు కస్తూరి మహేందర్. ప్రయివేటు మెకానిక్. అమ్మ ఉమాదేవి గృహిణి. మా నాన్న నాకు బైక్ డ్రైవింగ్ నేర్పించారు. నాకు డ్రైవింగ్ రావడంతో తెలంగాణ కోసం బైక్ పై తిరుగుతూ ప్రజలను చైతన్యపరచాలనే ఆలోచన వచ్చింది. ఈ విషయం నేను, చెల్లెలు కలిసి నాన్నకు చెప్పినం. ‘ఆడబిడ్డలైన మీకింత ధైర్యం ఉన్నప్పుడు తెలంగాణ విముక్తి కోసం నేను కాదనేది లేదు బిడ్డా. నేను కూడా మీకు అవసరమున్న ఊళ్లళ్లకు వస్త’ అన్నడు. దాంతో మాకు ధైర్యం వచ్చింది’’ అని చెప్పారు.
‘‘మొదట సురేష్ అనే వ్యక్తి దగ్గర బైక్ను తీసుకొని, 2009 డిసెంబర్లో సొంత ఊరు చల్లూరు నుండి ప్రచారం మొదలు పెట్టినం. తర్వాత నాన్న బైక్ను వాడుకున్నం. రాజాపేట మండలంలోని అన్ని గ్రామాలు తిరిగి యాదగిరిగుట్ట బాటపట్టినం. పొట్టిమర్రి నుంచి యాదగిరిగుట్టకు ప్రచార యాత్ర నిర్వహిస్తుంటే, యాదగిరిగుట్ట జేఏసీ నుంచి అపూర్వ ఆదరణ లభించింది. మా పర్యటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ మా వెన్నుతట్టి ప్రోత్సహిస్తుండ్రు’’ అని తమ పర్యటన అనుభవాల్ని వారు పంచుకున్నరు.
వారింకా ఇలా వివరించారు. ‘‘బైక్పై మేం వెళ్లే గ్రామాలకు ముందస్తుగా సమాచారం ఇవ్వడంతో ఎక్కడికక్కడ మేము చెప్పే మాటలకు ఆదరణ లభించింది. ‘బైక్మీద పల్లెటూర్లకు ఆడపిల్లలిద్దరు వస్తున్నరు’ అనగానే వందలమంది గుమిగూడే వారు. ముఖ్యంగా ఇంటర్, డిగ్రీ, ఉన్నత చదువులు చదివే విద్యార్థులు మేం చెప్పే విషయాలు జాగ్రత్తగా వింటున్నరు. వారందరితో ‘ఆత్మహత్యలు వద్దు… తెలంగాణ ముద్దు’ అని వివరంగా చెప్తున్నాం. దీనికి ముఖ్యంగా విద్యార్థుల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది’’ అని అన్నరు.
సొంతూరు చల్లూరులో మొదలైన వీరి ప్రచారం ఆలేరు నియోజక వర్గంలోని రాజాపేట,యాదగిరిగుట్ట, ఆలేరు, తుర్కపల్లి మండలాలలోని అన్ని గ్రామాలకూ చేరింది. ‘తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతనాయకులు చేసిన, చేస్తున్న అన్యాయాలను, విద్య, ఉద్యోగాలలో జరుగుతున్న వివక్షను కరపవూతాల ద్వారా పంపిణి చేస్తున్నారు. ‘ఉద్యమం ఎలా కొనసాగించాలి, అందులో విద్యార్థులు, మహిళలు ఎలా ముందుండాలి?’ వంటి విషయాలను కూడా ఈ సోదరీమణులు ప్రజలకు వివరిస్తున్న తీరు గ్రామీణులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలె. వీరికి కొన్ని బెదిరింపు ఫోన్లు కూడా వచ్చినయట. వాటి గురించి అడిగితే ‘‘గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి ‘ఆడపోరీలు మీరేం జేస్తరు. బైక్పై తిరిగి ప్రచారం చేస్తే తెలంగాణ వస్తదా? మీ తిరుగుడు ఆపండి’ అని బెదిరించే వారు. వీటిని మేం లెక్కచేయక నాన్న అండతో ముందుకు పోతున్నం’’ అని చెప్పినరు.
‘‘శ్రీకాంతన్న మాదిరిగా కాల్చుకొని ఆత్మబలిదానం చేయడం కాదు, బతికుండి తెలంగాణ సాధించుకోవాలనుకున్నాం’’ అని వారన్నరు.
-ఫొటో, వ్యాసం : గొట్టిపర్తి భాస్కర్
టీన్యూస్, యాదగిరిగుట్ట
ఎవలొవలు ఎమనుకుంటాడ్రు